హైదరాబాద్‌లో ఆర్సీజియం (Arcesium) విస్తరణకు ఒప్పందం

*హైదరాబాద్‌లో ఆర్సీజియం (Arcesium) విస్తరణకు ఒప్పందం*తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మరో కంపెనీతో అవగాహన కుదుర్చుకుంది. అసెట్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ సర్వీసెస్, అడ్వాన్స్‌డ్ డేటా ఆపరేషన్స్‌లో ప్రముఖ కంపెనీ ఆర్సీజియం (Arcesium) హైదరాబాద్‌లోని తమ కంపెనీని విస్తరించడానికి అంగీకరించింది.ఆర్సీజియం (Arcesium) సీఈఓ గౌరవ్ సూరి గారు, ఇతర ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర అధికారుల బృందం జరిపిన చర్చల్లో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఆర్సీజియం (Arcesium) అంతర్జాతీయంగా బయటి దేశాల్లో మొదటి శాఖను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసింది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అందిస్తున్న సహకారంతో తమ సేవలను మరింతగా విస్తరిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో కావలసిన సదుపాయాలకు అనుగుణంగా హైదరాబాద్‌లోని గొప్ప టాలెంట్ ఫోర్స్, సహజ రీతిలో ఉండే లొకేషన్, నైపుణ్యం కలిగిన స్థానిక ఉద్యోగుల లభ్యత కారణంగా అంకితభావంతో హైదరాబాద్‌లో డాటా సొల్యూషన్ సర్వీసులను అభివృద్ధి పరుస్తున్నామని గౌరవ్ సూరి తెలిపారు.వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుంది. డీఈ షా గ్రూప్ (DE Shaw group), బ్లాక్‌స్టోన్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ Blackstone Alternative Asset Management (BAAM) మద్దతుతో ఆర్సీజియం (Arcesium) స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది.ఆర్సీజియం (Arcesium) తన సేవలను విస్తరణ చేపడుతున్నందుకు ముఖ్యమంత్రి కంపెనీ ప్రతినిధులను అభినందించారు. కంపెనీకి తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణలో ఐటీ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.

194 total views, no views today

హైదరాబాద్‌లో ట్రైజిన్ (Trigyn) ఏఐ ఇన్నోవేషన్ సెంటర్

*హైదరాబాద్‌లో ట్రైజిన్ (Trigyn) ఏఐ ఇన్నోవేషన్ సెంటర్**-ఆరు నెలల్లో కార్యకలాపాల ప్రారంభం.. వెయ్యి మందికిపైగా ఉద్యోగాలు, శిక్షణ*ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ (Trigyn Technologies Limited) హైదరాబాద్ లో తమ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలోని అధికారుల బృందంతో Trigyn కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్ పై ఈ సందర్భంగా చర్చలు జరిపారు. Trigyn కంపెనీ డేటా అనలిటిక్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అందిస్తుంది. హైదరాబాద్ లో ట్రైజిన్ (Trigyn) కంపెనీ అర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రాబోయే మూడేండ్లలో 1,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకొని శిక్షణను అందిస్తుంది. Trigyn కంపెనీ మొత్తం ఆదాయం 160 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీలో పని చేస్తున్న 2,500 మందిలో వెయ్యి మంది మన దేశంలో ఉండగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు వంద మంది ఉన్నారు. మరో ఆరు నెలల్లోనే తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ఈ కంపెనీ ప్రకటించింది. రెండు దశాబ్దాలకు పైగా ఐక్య రాజ్య సమితితో పాటు అనుబంధ విభాగాలకు Trigyn కంపెనీ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. గత ఏడాది నుంచి ట్రైజిన్ కంపెనీ తమ సేవలను అందుకుంటున్న సంస్థల్లో అర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ వినియోగంతో పాటు ఫలితాలపై విశ్లేషణలు చేస్తోంది. అన్ని రంగాలలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ఎంచుకుంది.

286 total views, no views today

వాల్ష్ కర్రా హోల్డింగ్స్ (WKH) సంస్థ వీ-హబ్ [WE HUB – Women Entrepreneurs Hub]లో 5మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది

తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ప్రోత్సాహకంగా, అమెరికాకు చెందిన ప్రముఖ వాల్ష్ కర్రా హోల్డింగ్స్ (WKH) సంస్థ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వీ-హబ్ [WE HUB – Women Entrepreneurs Hub]లో 5మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి సమక్షంలో వాల్ష్ కర్రా హోల్డింగ్స్ సంస్థ ప్రతినిధులు – వీ హబ్ సీఈవో సీతా పల్లచోళ్ల ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాబోయే ఐదేండ్లలో 100 మిలియన్ డాలర్ల (రూ.839 కోట్ల) పెట్టుబడులను తెలంగాణ కేంద్రంగా పురుడుపోసుకుంటోన్న స్టార్టప్ కంపెనీల్లో పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వాల్ష్ కర్రా హోల్డింగ్స్ సహ వ్యవస్థాపకులు ఫణి కర్రా, గ్రేగ్ వాల్ష్ ముఖ్యమంత్రి బృందానికి వివరించారు.

188 total views, 3 views today

హైదరాబాద్ సమగ్ర, సమ్మిళిత అభివృద్ధిని నిర్దేశించే మాస్టర్ ప్లాన్ ఏడాదిలోపు అందుబాటులోకి

రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణ సమగ్ర, సమ్మిళిత అభివృద్ధిని నిర్దేశించే మాస్టర్ ప్లాన్ మరో ఏడాదిలోపు అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. క్రెడాయి హైదరాబాద్ ఆధ్వర్యంలో “రీ-ఇమాజినింగ్ హైదరాబాద్” కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.

భవిష్యత్ తరాలనూ దృష్టిలో ఉంచుకొని, రేపటి అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ 4.0 అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. నాలుగో మహా నగర నిర్మాణంలో భాగంగా ఆ ప్రణాళికల్లో కొన్ని పనులను కూడా చేపట్టామని తెలిపారు.

తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన బ్యాగరికంచె ప్రాంతం రాబోయే రోజుల్లో సంపదలో బంజారాహిల్స్‌ను మించిపోతుందని చెప్పారు.

పాలకులుగా ఎవరున్నా ఈ చారిత్రక నగర అభివృద్ధికి తీసుకున్న విధానాలు కొనసాగాయి కాబట్టే హైదరాబాద్ నగరానికి ప్రపంచం స్థాయిలో ఒక గుర్తింపు వచ్చిందన్నారు.

మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్‌తో కలుషితం లేని నీటి ప్రవాహాన్ని చూడబోతున్నామని, తద్వారా హైదరాబాద్ బ్రాండ్ వ్యాల్యూ మరింత పెరిగి నగరం చుట్టుపక్కల్లో పెట్టుబడులు వెల్లువలా వస్తాయని ముఖ్యమంత్రి అన్నారు.

కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, క్రెడాయి ప్రతినిధులు పాల్గొన్నారు.

292 total views, no views today

హెచ్ఎండిఏ ల్యాండ్ పూలింగ్ కోసం ప్రత్యేక ప్రణాళిక

ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ల్యాండ్ పూలింగ్ ద్వారా వేయి ఎకరాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.

అవుటర్ రింగ్ రోడ్డుకు, ప్రాంతీయరింగ్ రోడ్డుకు మధ్య లేఔట్ లు అభివృద్ధి చేసి వేలం వేస్తే హెచ్ఎండిఏకు ఆదాయంతోపాటు, మధ్యతరగతి వారికి ధరలు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు.

ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ల్యాండ్ పూలింగ్ ద్వారా వేయి ఎకరాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇన్ ముల్ నర్వ లో 95.25 ఎకరాల్లో లేఔట్ అభివృద్ధి చేసి, లేమూరులో 83.48 ఎకరాల్లో లేఔట్లను అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయించారు.

హెచ్ఎండిఏ లేఅవుట్ల కోసం గుర్తించిన భూముల్లో దాదాపు సాగులో లేనివే. అవి అసైన్డ్ కేటగిరీలో ఉండటంతో రైతులతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సేకరించిన భూమిని హెచ్ఎండిఏ అభివృద్ధి చేసి లేఅవుట్ కింద తీర్చిదిద్దుతుంది. రైతు భూ యజమానిగా, హెచ్ఎండిఏ డెవలపర్ గా ఉంటుంది. ఇందులో రైతులకు 60 శాతం బదిలీ చేస్తుంది. మిగతా 40 శాతం హెచ్ఎండిఏ విక్రయిస్తుంది. ల్యాండ్ పూలింగ్ లో భాగంగా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్గిరి పరిధిలో దాదాపు 924.28 ఎకరాలు అధికారులు పరిశీలించారు.

ఆదాయం పెంపు దిశగా అడుగులు

హెచ్ఎండిఏ పై ఇప్పటికీ ప్రభుత్వం దృష్టి సారించింది. రూ. 500 కోట్ల వరకు మౌలిక వసతులకు కేటాయించింది. అవుటర్ రింగ్ రోడ్డుకు, ప్రాంతీయరింగ్ రోడ్డుకు మధ్య లేఔట్ లు అభివృద్ధి చేసి వేలం వేస్తే హెచ్ఎండిఏకు ఆదాయంతోపాటు, మధ్యతరగతి వారికి ధరలు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ లో 355, బోగారంలో 125, ప్రతాప్సింగారంలో 152, నాదర్గుల్ లో 91 ఎకరాల్లో లేఅవుట్లు తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

212 total views, no views today

మూడు నెలల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తీ 

  • ఎల్ఆర్ఎస్  ప్రక్రియకు మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం 
  • ఈ వారం నుంచి దరఖాస్తుల పరిశీలన  ప్రారంభం 
  • ప్లాట్లకు మూడు దశల్లో, లేఔట్లకు నాలుగు దశల్లో పరిశీలన 

రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు ప్లాట్లు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూడు నెలల్లో దరఖాస్తులను పరిశీలించి అర్హమైన వాటిని క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఆగస్టు మొదటి వారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి ఎం దానకిషోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాట్ల దరఖాస్తులను మూడు దశల్లో లేఅవుట్ల దరఖాస్తులను నాలుగు దశల్లో పరిశీలించాలని నిబంధనలో పేర్కొన్నారు. అనంతరం వాటిలో అర్హమైన వాటిని నిర్ధారిత ఫీజులు వసూలు చేసి క్రమబద్ధీకరిస్తారు. 

25 లక్షల దరఖాస్తులు 

స్థలాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 2020లో  సుమారు 25 లక్షల మంది దరఖాస్తు చేశారు కోర్ట్ లో కేసులు ఉండడంతో అవి పరిష్కారానికి నోచుకోలేదు.  ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి మాత్రం కోర్టు తీర్పునకు లోబడి ఉంటామంటూ  అఫిడవిట్ తీసుకొని అధికారులు అనుమతులు ఇస్తున్నారు. గత డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన నాటినుండి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉత్తర్వుల జారీ తో దరఖాస్తుదారులను హర్షం వ్యక్తం అవుతుంది.  

ముందుగా  సిజిజి పరిశీలన 

ఆ దరఖాస్తులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ముందుగా  పరిశీలిస్తుంది. వివిధ నిబంధనల ఆధారంగా కంప్యూటర్ ద్వారా వడపోస్తుంది. ఆయా  ఆస్తులు నిషేధిత జాబితాలో ఉంటే గుర్తించి దరఖాస్తుదారులకు సమాచారం పంపుతుంది.  దరఖాస్తుదారులు అవసరమైన పూర్తిస్థాయి పత్రాలు ఇవ్వకుంటే దానిపైన సమాచారాన్ని పంపుతుంది. 

సి జి జి వడపోత తరువాత మిగిలిన దరఖాస్తులను రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, పంచాయతీ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది. నాళాలు, చెరువులు, వారసత్వ సంపద, శిఖం, దేవాదాయ, ఇనాం భూములు తదితర కోణాల్లో పరిశీలించి అభ్యంతరాలను నమోదు చేస్తారు. ఆయా వివరాలను ఇప్పటికే సిజిజి రూపొందించిన సెల్ ఫోన్ యాప్ లలో నమోదు చేస్తారు

 రెండో దశలో 

మరింత అధ్యయనం చేసి అర్హమైన నిర్ధారిత ఫీజు చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హమైనవి కాదని గుర్తిస్తే ఆ దరఖాస్తులను తిరస్కరిస్తారు. ఆ సమాచారాన్ని దరఖాస్తుదారులకు పంపుతారు. 

మూడో దశలో 

అర్హమైన దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించినట్లు నిర్ధారించాక క్రమబద్ధీకరణ ఉత్తర్వులను జారీ చేస్తారు. 

లే అవుట్ల విషయంలో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల ఆధ్వర్యంలోని వివిధ విభాగాల అధికారులు పరిశీలన చేస్తారు 

సహాయ కేంద్రాల ఏర్పాటు 

క్రమబద్ధీకరణ దరఖాస్తులపై జారీచేసిన నోటీసులకు సంబంధించిన సమస్యలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లు స్థానిక సంస్థ కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలు భాగస్వాములయ్యే అన్ని స్థాయిల సిబ్బంది అధికారులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఎల్ఆర్ఎస్ వెబ్ సైట్లో రిజిస్టర్డ్ మొబైల్ నంబరుతో స్టేటస్ చెక్ చేసుకోవడానికి https://lrs.telangana.gov.in/layouts/CitizenLogin.aspx

221 total views, no views today